SonuSood: సోనూసూద్ గురించి ఎంత చెప్పినా కొంచెం మిగిలే ఉంటుంది.. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి తన సేవలతో రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇటీవల ఫ్రాన్స్, అమెరికా నుంచి ఆక్సిజన్ ప్లాంట్ లను తెప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. అయితే మొదటి రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, నెల్లూరు లో ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేశారు. సోనుసూద్, అతని బృందం ఇప్పుడు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసే పనిలో ఉంది. తరువాత నెల్లూరులో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కావలసిన మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ , ఇతర సంబంధిత అధికారుల నుండి పర్మిషన్ తీసుకున్నారు..
ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ “సోను సూద్ మానవత్వ ఆలోచనలకు మేమందరం నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆయన ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ప్రతి రోజు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది కరోనా రోగులకు చికిత్స చేయడంలో ఉపయోగాపడుతుంది” అని తెలిపారు. ఈ సందర్భంగా సోనుసూద్ మాట్లాడుతూ.. “ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచేందుకు ఈ ప్లాంట్స్ చాలా అవసరం. ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ కరోనాతో ధైర్యంగా పోరాడడానికి అవసరమైనవారికి సహాయపడతాయని నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ప్లాంట్స్ ఏర్పాటు చేసిన తరువాత జూలైలో మిగతా రాష్ట్రాలలో మరికొన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే మేము వివిధ రాష్ట్రాలలో దయనీయంగా ఉన్న ఆసుపత్రుల వివరాలను సేకరించాము” అని వివరించారు.